16, మే 2020, శనివారం

కూలిపోయిన కూలి బతుకులు.. కడుపునింపని ప్యాకేజీలు..

ఎర్రటి ఎండ.. కాళ్లకు సగం సగం ఊడిపోయి ఎప్పుడు తెగిపోతాయో తెలియని చెప్పులు..
 నెత్తిన మూట, పక్కన పదేండ్ల కూతురు, ఆ అమ్మాయి చేతిలో చంటిపాప, భార్య చేతిలో పెద్ద మూట, పక్కన నెత్తిమీద బరువుతో భార్య.. 
ఇలా మొత్తం కుటుంబం వందల కిలోమీటర్లు కాలినడకన సొంతూళ్లకు చేరుకునేందుకు నానా యాతనలు పడుతున్నారు. వందల కిలో మీటర్లు నడుస్తున్నారు. జనం లక్షల సంఖ్యలో ఇప్పటికీ హైవేలలో ముందుకు సాగుతున్నారు.  వీరిలో కొందరు దారిలో ప్రాణాలు వదులుతున్నారు.

తక్షణం వలస కూలీలను ఎలా ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడా కనిపించలేదు. వలసకూలీలు ఆకలికీ, నిరుద్యోగానికీ, వందలమైళ్ల నడకకూ భయపడటం లేదు. కానీ పాలకుల వివక్షకు మాత్రం వారు ఆందోళనకు గురవుతున్నారు. నిజమే, కోట్లాది మంది వలసకూలీలను పట్టించుకోని పాలకుల భయానకమైన బాధ్యతా రాహిత్యానికి రోడ్లపాలైన కూలీల బతుకులు, పట్టాలపై, రోడ్లపై విగతజీవులైన వారి జీవన్మృత సాక్ష్యాలు.

లాక్‌డౌన్‌ ప్రకటించి 50 రోజులు దాటింది. అలా ప్రకటించే టప్పుడు పొట్టచేతపట్టుకుని నగరాలకు వలస వచ్చిన కూలీలు పరిస్థితి ఏమిటి? వారెలా జీవిస్తారు? ఎక్కడ ఉంటారు? వీరి బతుకులను ఏం చేయాలనే ఆలోచన, ప్రణాళిక లేకుండా వారిని బతికి ఉండేలా చేయాలనే ధ్యాస లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ వలస కార్మికులు 20 కోట్ల వరకు ఉంటారు. వలస కార్మికుల గురించి ప్రభుత్వానికి అవగాహనలేదు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి