1, మే 2019, బుధవారం

సూచనలొద్దు ...ఆచరించండి...

కాలుష్య నివారణకు చర్యలు తీసుకోండి...
తెలంగాణ రాష్ట్రంలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు అవసరమని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ధర్మాసనం అభిప్రాయపడింది. అసలు పర్యావరణ కాలుష్యానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ఎన్జీటీ ప్రశ్నించింది. పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఉద్ఘాటించింది. సోమవారం ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ కాలుష్య నియంత్రణపై విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ ఎస్‌కే జోషితో పాటు పీసీబీ అధికారులు సైతం హాజరయ్యారు.
        తెలంగాణలో అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయంపై ఎన్జీటీ ఘాటుగా స్పందించింది. స్థానిక కలెక్టర్లతో రాష్ట్ర సీఎస్‌, పీసీబీ అధికారులు నెలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. దీనికి స్పందించిన సీఎస్‌ ఇక నుంచి ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. ఆరు నెలల్లో కాలుష్య నియంత్రణ లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించింది. మరో ఆరు నెలల తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలను పూర్తిమేర సమీక్షిస్తామని హరిత ట్రిబ్యూనల్‌ ధర్మాసనం విచారణ సందర్భంగా చెప్పింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి