27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఆ పేరు వింటేనే హృదయాలు ఉత్తేజితమవుతాయి...


భగత్‌సింగ్‌ పేరు వినిపిస్తేనే భారతీయులందరికి హృదయాలు ఉత్తేజితమవుతాయి.
                 దేశంకోసం తన ప్రాణాల్ని తృణప్రాయంగా వదిలిన విప్లవవీరుడు భగత్‌సింగ్‌. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే మనస్సు ఉద్వేగానికి లోనవుతుంది. భగత్‌సింగ్‌ ఒక విప్లవ స్ఫూర్తి, రగులుతున్న కాగడాల నుండి ఎగిసిపడే చైతన్యపు జ్వాల. ఆయన 1907 సెప్టెంబర్‌ 27 పంజాబ్‌లోని లాయల్‌పూర్‌ జిల్లా బంగా గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు విద్యావతి, కిషన్‌సింగ్‌.
               తన చిన్ననాడే జరిగిన జలియన్‌వాలాబాగ్‌ దురంతం ఆయనను కలిచివేసింది. దానికి కారణమైన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల్ని ఈ దేశం నుండి తరిమికొట్టాలంటే విప్లవకారులందరు ఎవరికి వారు పని చేయడం కాదు అందరూ ఏకమై ఐక్యంగా పనిచేసినపుడే సాధ్యమని విప్లవకారులందరినీ ఏకంచేశారు.భారతీయుల కనీస హక్కులు కాలరాసే చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్‌లో పొగబాంబు వేశారు.పార్లమెంట్‌లో పొగబాంబు వేస్తే ఖచ్చితంగా ఉరి తీస్తారని తెలిసి కూడా పారిపోని ధీశాలి. మన స్వాతంత్య్రం కేవలం తెల్లదొరలు పోయి నల్లదొరల పెత్తనం చేసేదిగా ఉండకూడదని, కూడు, గుడ్డ, విద్యా, వైద్యం, ఉపాధి అందరికి కల్పించే ''సమసమాజం'' కావాలని భగత్‌సింగ్‌ ఆకాంక్షించారు.
       నేటి విద్యార్ధి, యువత భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్దులవటమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.
                            ఇంక్విలాబ్‌ జిందాబాద్‌.
నేడు భగత్‌సింగ్‌ 105 వ జయంతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి