3, అక్టోబర్ 2018, బుధవారం

పర్యావరణాన్ని కాపాడలని మానవహారం ...

పర్యావరణాన్ని కాపాడలని ట్యాంక్ బండ్ పైన ( హైదరాబాద్‌ ) అక్టోబర్ 2 మానవహారం లో ...
కాలుష్య నివారణకు ఐక్య ఉద్యమం -  ఈ పాపం పెట్టుబడిదారులదే : మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య
- పరిశుభ్ర నగరంగా మార్చుదాం : జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌

                   ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కాలుష్య పాపం పెట్టుబడిదారులదేనని, దీని నివారణను ప్రజలంతా ఉద్యమంగా స్వీకరించాలని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కోరారు. హైదరాబాద్‌ నగరం కూడా కాలుష్యంలో ఢిల్లీ, బెంగళూర్‌తో పోటీ పడుతున్నదని చెప్పారు. తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక (పట్నం) ఆధ్వర్యంలో 'కాలుష్యాన్ని నివారించండి- పర్యావరణ పరిరక్షణకై నడుంకట్టండి' నినాదంతో ట్యాంక్‌బండ్‌పై భారీ మానవహారం నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని, కాలుష్యాన్ని నివరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ...కాలుష్యం కేవలం నగరానికో, దేశానికో సంబంధించిన అంశం కాదనీ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య అని చెప్పారు. దీనిపై ప్రభుత్వాలు కూడా సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్లాస్టిక్‌, పాలిథిన్‌తో వాయుకాలుష్యం, జనకాలుష్యం అవుతుందన్నారు. పరిశ్రమల్లో వచ్చే లాభాలను పెట్టుబడిదారులు తీసుకుంటూ, కాలుష్యాన్ని మనకు ఇస్తున్నారని విమర్శించారు.
               జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ మాట్లాడుతూ...కాలుష్యంలేని స్వచ్ఛ తెలంగాణ నిర్మాణంగా మార్చేందుకు అందరం ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్‌ నగరాన్ని కూడా స్వచ్ఛకార్మికుల సహాయంతో పారిశుభ్రమైన నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నగరంలో స్వచ్ఛ సర్వే జరుగుతున్నదన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు శుభ్రతను తమ జీవనంలో భాగం చేసుకోవాలని కోరారు.
            ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల మాట్లాడుతూ...కాలుష్య నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా స్పందించాలన్నారు. సర్కారు ఆలోచించేలా ప్రజల నుంచి ఒత్తిడి పెరగాలని కోరారు. విద్యాసంస్థలు, హాస్పిటల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా అన్నిచోట్ల కాలుష్య నివారణ కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.      

            సినీనటులు మాదాల రవి మాట్లాడుతూ...కాలుష్య నివారణకు అందరం ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ రోజా, ప్రముఖ పాత్రికేయులు రాంచంద్రమూర్తి, సామాజికవేత్త గోపాల్‌రావు, వివిధ సంఘాల నాయకులు శోభన్‌నాయక్‌, మహేందర్‌, అరుణజ్యోతి, రాజేశం, మారన్న, సైదులు, మూర్తి, నరేశ్‌, జావీద్‌, వాణి తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌ నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు.
 





1 కామెంట్‌: