26, ఆగస్టు 2011, శుక్రవారం

మనిషి రూపంలోని దైవస్వరూపం...

మనిషి రూపంలోని దైవస్వరూపం
        -మదర్‌ థెరిస్సా
ప్రేమ, కరుణ, జాలికి ప్రతిరూపం మదర్‌ థెరెస్సా. ఆమె నిరుపేదలను, గూడులేని అభాగ్యులను, అనాథలను, వికలాంగులను, వ్యాధిగ్రస్తులను, దిక్కులేని అనాథలను అక్కున చేర్చుకుంది. వారికి ఆశ్రయం కల్పించి, వారు తలదాచుకోవడానికో గూడును ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక అనాధాశ్రమాలను స్థాపించిన మదర్‌, ఎక్కువగా కలకత్తాలోని మురికివాడలలో పేదల కోసం పని చేసింది. తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేసిన మదర్‌ థెరెస్సా... ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు, కరుణకు, ఆత్మస్థైర్యానికి, నమ్మకానికి పర్యాయపదంగా నిలిచిపోయింది.

           ఒంటరిగానే ఆశయసిద్ధి కోసం ప్రయత్నం ప్రారంభించి, వేలాదిమందిని తనతో కలుపుకుని, తన మార్గంలో నడిచేలా చేసింది ఆ మహనీయురాలు. మదర్‌ థెరెసా మొదటి పేరు ఆగెస్‌ గోన్‌జా బోజాషు. అందరు  ప్రేమగా పిలుచుకునే 'మదర్‌ థెరిసా'!



           మదర్‌ 1910 ఆగస్టు 26న మాసిడోనియా రాజధాని అయిన 'స్కోప్జె' నగరంలో జన్మించింది. తను పుట్టుకతో ఆల్బేనియా దేశస్థురాలు. ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించడం, 18 సంవత్సరాల వయస్సుకల్లా ఇల్లొదిలి 'సన్యాసిని (నన్‌)'గా జీవితాన్ని ప్రారంభించడం మదర్‌ జీవితంలో కీలకఘట్టాలు. 1929లో భారతదేశానికి వచ్చి 'లొరెటో కాన్వెంట్‌'లో ఉపాధ్యాయినిగా పనిచేయడం ప్రారంభించింది.   పేదలు, రోగుల కొరకు సొంతంగా సేవా కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.  1948 నుంచి తన కార్యాచరణను ప్రారంభించి 'నిర్మల్‌ హృదరు, శాంతినగర్‌, నిర్మల్‌ శిశుభవన్‌'లాంటి శరణాలయాలను 'మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ' పేరుతో విడతలుగా ఏర్పరిచింది. అనాథలు, రోగులు, మత్తుపదార్థాలకు బానిసలైనవారు, మురికివాడల్లోని పిల్లలు.. ఇలా సమాజ బహిష్కరణకు గురై, తిరస్కరణ భావానకు గురై కుమిలిపోతూ మరణాన్ని ఆహ్వానించే వారందరికీ 'మదర్‌' చేయూతగా నిలిచారు.

భారతదేశంలోనేగాక నేడు 123 దేశాల్లో దాదాపు 610 కార్యాచరణ కేంద్రాలు 'మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ' కింద పనిచేస్తున్నాయి. మదర్‌ సేవా కార్యక్రమాలకు ప్రతిఫలంగా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. వాటిలో ముఖ్యమైనవి 1962లోని 'రామన్‌ మెగసెసే' అవార్డ్‌, 1979లో లభించిన 'నోబుల్‌ శాంతి' బహు మతి, 1980లో ఇవ్వబడిన 'భారతరత్న'. పలు దేశాల పురస్కారాలతోబాటు విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు ఆమెకు లభించాయి. మనుషుల మధ్య సేవావారధి ద్వారా మానవత్వాన్ని పెంచుతూనే మదర్‌ సెప్టెంబర్‌ 5, 1997న మరణించారు.

             ఆమె ధనాన్ని, కాలాన్ని సద్వినియోగపరిచింది. తనకు అందిన ప్రతి పైసాను కూడా దీనుల సేవకే వినియోగించింది. అలాగే ఏ ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థంగా ఖర్చుపెట్టలేదు.  ఆమెలోని అత్యంత ప్రధానమైన సుగుణాలు కరుణ, సేవ చేయడంలో సంతృప్తి చెందటం. బాధల్లో ఉన్న వ్యక్తితో సహానుభూతి పొందడం అందరికీ సాధ్యపడదు. హృదయంలో అపారమైన కరుణాభావం నిండి ఉన్నవారికే అది సాధ్యం. అందుకే దీనులను చూస్తేనే ఆమె హృదయం కరిగిపోయేది. సేవచేసి వారి బాధలను తొలగించానన్న తృప్తి ఆమెకు అపరిమితమైన శక్తినిచ్చేది.
                  

         తన జీవితం ద్వారా 'సేవ'కు సరైన అర్థాన్ని చెప్పిన 'మదర్‌ థెరిసా' జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం, స్ఫూర్తివంతం. 
అంతటి మహనీయురాలి జయంతి నేడు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి