28, మార్చి 2016, సోమవారం

విరాట్ ఫటాఫట్...

... మిగిలింది  18 బంతులు. తీయాల్సింది 39 పరుగులు.  
   కొడతారంటారా... కష్టమే!     కొట్టినా కొట్టొచ్చు... కొంచెం ఆశ! 
                 ఆ ఆశ నిలిచింది. గెలుపు వరించింది. క్రీజులో చేజింగ్‌ వీరుడు విరాట్‌ కోహ్లి, సూపర్‌ ఫినిషర్‌ ధనాధన్‌ ధోనీ! చేతిలో బోలెడన్ని వికెట్లు! చెలరేగితే పోయేదేముంది! విజయమే... వీర స్వర్గమేదీ లేదు! విరాట్‌ స్వరూపుడి వీర విహారంతో ఆస్ట్రేలియాపై భారత్ అదరగొట్టే విజయం సాధించింది. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే... సూపర్‌ విక్టరీతో భారత సెమీ్‌సలోకి దూసుకెళ్లింది. ఇదంతా విరాట్‌ కోహ్లీ వీరోచిత ఉతుకుడు మహిమ! ‘ఈ ఓవర్‌లో రెండు ఫోర్లు పడితే చాలు’ అని సగటు అభిమాని ప్రార్థించగా... ‘రెండెందుకు, నాలుగు తీస్కో’ అంటూ... విరాట్‌ దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ప్రసాదించాడు.

17వ ఓవర్‌లో మొదలైన పరుగుల వరద... 19వ ఓవర్‌ మొదటి బంతితో గెలుపు తీరం చేరేదాకా సాగింది. కేవలం 13 బంతుల్లో... 39 పరుగులు. అందులో... 33 విరాట్‌ బ్యాటు నుంచి రాకెట్‌లా రాలిపడ్డవే! అటోఇటో తేలాల్సిన మ్యాచ్‌... 161 పరుగుల లక్ష్యం! మనోళ్ల బ్యాటాట మొదట్లో కాసింత మెల్లగానే మొదలైంది. రానురాను ‘ఇక కష్టమేమో బాసూ’ అనిపించింది. ఒక దశలో... 36 బంతుల్లో 67 పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఆసే్ట్రలియన్‌ల ముఖాల్లో అప్పటికే ‘గెలుపోత్సాహం’ కనిపిస్తోంది. ఈ దశలోనే ‘సూపర్‌ చేజర్‌’ కోహ్లీ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. బంతిని దునుమాడాడు. విక్టరీ వన్‌సైడ్‌ చేశాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82 పరుగులు తీసి... మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అంతేకాదు... జట్టును సెమీస్ లోకి చేర్చి, కప్పుపై ఆశలు సజీవంగా ఉంచాడు.