24, మార్చి 2014, సోమవారం

కమనీయ కోల్‌కతా...

          కోల్‌కతాలో కమనీయ ప్రాంతాలు 
మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన నగరం కోలకతా.1711 నుంచి రెండు శతాబ్దాల పాటు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు కోల్‌కతా రాజధానిగా భారత్‌ను పరిపాలించారు.1911లో రాజధాని న్యూఢిల్లీకి మారింది. ఇంతటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నగరంలో దర్శనీయ ప్రాంతాలెన్నో. వాటిలో 90 శాతం బ్రిటిష్‌ వారు నిర్మించినవేనంటే ఆశ్చర్యం వేస్తుంది. అతి ముఖ్యమైన ఏడు ప్రదేశాల విశేషాలు ఈ వారం మీ కోసం.
హౌరా వారధి
        కోల్‌కతా, హౌరా జంట నగరాలు. ఆ రెండు నగరాల మధ్య హూగ్లీ నది ప్రవహిస్తుంది. ఈ జంట నగరాలను కలపడానికి బ్రిటిషర్లు హౌరా వారధి నిర్మించారు. నగరానికి జీవనాడి వంటిది ఈ వారధి. వంతెన పని 1935లో ప్రారంభిస్తే 1939లో నిర్మాణం పూర్తయింది.1943లో ఈ వారధిపై ట్రాఫిక్‌ను అనుమతించారు. 705 మీటర్ల పొడవు, 71 అడుగుల వెడల్పు ఉన్న ఈ వంతెన నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.333 కోట్లు ఖర్చయింది. 26,500 టన్నుల స్టీలుతో దీన్ని నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో నట్లు, బోల్టులు వాడలేదంటే నమ్మగలరా? క్యాంటీ లీవర్‌ ట్రస్‌ పద్దతిలో దీన్ని నిర్మించారు. గత 70 ఏళ్లుగా కోల్‌కతా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా సేవలందిస్తోంది. ఈ వంతెన అందాన్ని కెమెరాల్లో బంధించాలంటే హుగ్లీనది మధ్యలో నుంచి ఫొటో తీస్తే సరి.

విక్టోరియా మెమోరియల్‌
          బ్రిటిష్‌ రాణి విక్టోరియా స్మారకంగా విక్టోరియా మెమోరియల్‌ హాల్‌ను నిర్మించారు. ఈ భవనం బ్రిటిష్‌, మొఘల్‌ నిర్మాణ శైలుల కలయికతో ఎంతో అందంగా ఉంటుంది. తెల్లని మకరానా పాలరాతితో ఈ భవనాన్ని నిర్మించారు. 1906లో నిర్మాణం ప్రారంభిస్తే 1921లో పూర్తయింది. 64 ఎకరాల్లో విరబూసిన పూదోటల మధ్య ఈ రాజ భవనం అలరారుతుంటుంది. ఈ భవనంలో విక్టోరియా రాణికి చెందిన వస్తువులు, అప్పటి బ్రిటిష్‌ పాలనలోని విశేషాలతో కూడిన ఓ మ్యూజియం కూడా ఉంది.

20, మార్చి 2014, గురువారం

కొండల్లో... కోనల్లో... హోర్నాడు ప్రయాణం

            కొండలు, కోనలు,వాగులు, వంకలు, అరుదైన జీవవైవిధ్యం కలసి ఒకే ప్రాంతంలో ఉంటే అదే కుద్రేముఖ్‌. అలాంటి అసాధారణ పర్వత, అటవీ మార్గంలో హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయానికి మేం చేసిన ప్రయాణ విశేషాల గురించి ఈ వారం చెప్పుకుందాం. భారత పశ్చిమ తీర రాష్ట్రం కర్నాటకలో మా యాత్ర మురుదేశ్వర్‌, ఉడిపి, శృంగేరీ మఠాలను దాటుకుంటూ సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న కుద్రేముఖ్‌ పర్వత, అటవీ మార్గం ద్వారా ఓ సాహసయాత్రలా సాగింది.
    
మురుదేశ్వర్‌, అక్కడి నుంచి 27 కిలోమీటర్ల దూరంలోని కొల్లూరు మీదుగా మరో 160 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కుద్రేముఖ్‌ నేషనల్‌ పార్క్‌ వస్తుంది. ప్రపంచాన్ని లేదా చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టిరావాలన్న కోరిక, తీరిక, బలమైన ఆకాంక్ష ఉన్నవారు తమ జీవితకాలంలో చేసే విహారయాత్రలు ఒక్కోటి ఒక్కో విధమైన అనుభవంగా, అనుభూతిగా మిగిలిపోతాయి. సముద్రతీర ప్రాంతాలలోని క్షేత్రాలు, స్థలాలు ఎక్కడ లేని ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని తీసుకువస్తే, ఎత్తయిన కొండలు, దట్టమైన అడవులు, ఇరుకైన లోయలు, అరుదైన జీవ వైవిధ్యంతో కూడిన ప్రాంతాల పర్యటన పట్టలేని ఆనందాన్ని, ఉత్కంఠను, ఓ సాహస యాత్ర చేశామన్న భావనను తీసుకువస్తాయి. అలాంటి యాత్రగానే చిక్‌మగళూరు జిల్లాలోని కుద్రేముఖ్‌, హోర్నాడు అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయాలు. 
                  వాస్తవానికి మా కర్నాటక యాత్ర రూట్‌ మ్యాప్‌లో కుద్రేముఖ్‌ పర్వత మార్గం లేదు. కొల్లూరు నుంచి షిమోగా మీదుగా హోర్నాడుకు వెళ్లాల్సిన మార్గం గతుకులతో ప్రయాణానికి అంత అనువుగా ఉండదని, కొంచెం దూరం ఎక్కువైనా వేరే మార్గం ద్వారా వెళదామని మా కారు డ్రైవర్‌ చెప్పడంతో.. సరే పోనీ అంటూ పచ్చ జెండా ఊపామే గానీ, మేం వెళ్లబోయే మార్గం ఎంత ప్రమాదకరమైనదీ, అరుదైనదీ, అసాధారణమైనదో ప్రయాణం పూర్తయ్యే వరకూ మాకు తెలియదు. ఈ మార్గంలో వెళ్లకుంటే ఎంత అరుదైన అవకాశం కోల్పోయే వాళ్లమో మాటల్లో చెప్పాల్సిన పని లేదు. కాకులు దూరని కారడవి లాంటి కుద్రేముఖ్‌ సంరక్షిత అటవీ మార్గంలో ప్రవేశించబోయే ముందు దాని గొప్పతనమేమిటో ఇక్కడ చెప్పి తీరాలి.
పడమటి కనుమల పచ్చిక తివాచీ..

19, మార్చి 2014, బుధవారం

ఎయిర్‌షోలో సందర్శకులు నిరాశకు గురి..

               అంతర్జాతీయ విమాన ప్రదర్శనను చూడ్డానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. బేగంపేట్‌ ( హైదరాబాద్‌) విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది. ఈనెల 12-16 వరకు (మార్చి 2014)  నిర్వహించిన ఇండియన్‌ ఏవీయేషన్‌-2014లో భాగంగా ఎయిర్‌ షోను తిలకించడానికి శనివారం సాధారణ జనానికి అనుమతించడంతో పిల్లపాపలతో భారీగా వచ్చారు. ఏవీయేషన్‌ షో తిలకించడానికి ఆశగా వచ్చిన జనం విన్యాసాలతో సరిపెట్టుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద విమానమైన ఎయిర్‌బస్‌ వెళ్లిపోవడంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. ఇతర విమానాలు కూబి ఎక్కువగా కనిపించలేదు.  
                 
              ఒక్కొ‌క్కరికి టికెట్‌ రూ.300 వసూలు చేశారు. పిల్లలకు సైతం టికెట్‌ పెట్టారు. వచ్చిన జనం కూర్చుకోవడానికి కనీసం కుర్చీవేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు విమానాలను చూడ్డానికి అనుమతిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఏదీ తిందామ‌న్నా‌.. రూ.100కుపైనే.. ఎయిర్‌షోను చూడ్డానికొచ్చిన జనాన్ని నిలువున దోచుకున్నారు. వెజ్‌ ఫ్రైడ్‌రైస్‌, నూడిల్స్‌, చికెన్‌రైస్‌, చపాతి ప్లేట్‌కు రూ.120 వసూలు చేస్తున్నారు. తాగడానికి నీళ్లు కూడాలేవు. నీళ్లు తప్ప ఏదీ తక్కువ లేదు. అలరించిన విన్యాసాలు.. జెట్‌ విమానాల విన్యాసాలు అలరించాయి. 



8, మార్చి 2014, శనివారం

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని..

పార్టీ ఎంచుకున్న రాజకీయ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ద్వారా ప్రజలకు ఎన్నో విధాలా మేలు జరుగుతుందని పాలక వర్గాలు పేర్కొన్నాయన్నారు. వీటిని ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మారని తెలిపారు. రాబోయే కాలంలో పాలకవర్గాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని పోరాటం సాగిస్తామన్నారు. అదేవిధంగా విభజన సమయంలో తెలంగాణ ప్రాంతంలో పార్టీకి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, అయినప్పటికీ.. పార్టీ వాటన్నింటినీ తట్టుకుందని తెలిపారు. దీనికి కారణం కార్యకర్తల్లో ఉన్న క్రమశిక్షణ, ఐక్యతే కారణమని, దాన్ని కాపాడుకునేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అంతిమంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం , వారి ఆంకాంక్షలను నెరవేర్చడం కోసం ఉద్యమాలను రూపొందిస్తామని పేర్కొన్నారు.

       ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధు

      రాష్ట్ర విభజన నేపథ్యంలో సీపీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం కీలక సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, సీతారం ఏచూరీ, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పెనుమల్లి మధును నియమించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు కమిటీలు నియమించింది మొట్టమొదటి పార్టీ సీపీఎం అని చెప్పవచ్చు.