20, ఫిబ్రవరి 2014, గురువారం

రాజ్యసభ టీ బిల్లుకు ఆమోదం...


ఎన్నో వాయిదాలు... ఎన్నో సంప్రదింపులు.. ఎన్నో తర్జనభర్జనలు.. సుదీర్ఘ చర్చ.. తీవ్ర గందరగోళం మధ్య ఎట్టకేలకు పెద్దల సభ తెలంగాణ బిల్లుకు జై కొట్టింది. మొన్న లోక్ సభ, ఇవాళ రాజ్యసభ టీ బిల్లుకు ఆమోదం తెలిపాయి. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. మిగిలింది ప్రథమ పౌరుడి సంతకమే. రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుంది. 

ఇవాళ ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య సభ వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మధ్యాహ్నం మూడు గంటల తరువాత తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. క్లాజుల వారిగా బిల్లుపై ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటింగ్‌తో బిల్లును సభ ఆమోదించింది. సీమాంధ్ర సభ్యుల ఆందోళనల మధ్య సాయంత్రం 4గంటలకు చర్చ మొదలయింది. బీజేపీ, సీపీఐ, బీఎస్పీ, ఆర్జేడీ, ఎల్జేపీ, టీ టీడీపీలు బిల్లును స్వాగతించగా, సీపీఎం, ఎస్‌పీ, డీఎంకే, జేడీయూ, టీఎంసీ పార్టీలు వ్యతిరేకించాయి. ప్రతిపక్ష, పాలక పక్ష సభ్యులు బిల్లుపై మాట్లాడారు. చివర్లో ప్రధాని మాట్లాడుతూ.. సీమాంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక పతిపత్తి కల్పిస్తున్నట్లు ప్రకటించారు.


18, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలంగాణ బిల్లుకు లోక్ సభ ఆమోదం...

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013కు లోక్ సభ ఆమోదం తెలిపింది.
మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.
 అంతకు ముందు సభలో తీవ్ర స్థాయిలో గందరగోళం నెలకొంది. సీమాంధ్ర ప్రాంత సభ్యులు స్పీకర్ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేయడంతో సభ మూడు సార్లు వాయిదా పడింది. దీనివల్ల టి.బిల్లుపై నాలుగు గంటలపాటు జరపాలని నిర్ణయించినప్పటికీ.. కేవలం 23 నిమిషాల పాటే చర్చ సాగింది.